![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 07:45 PM
మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించి.. డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చేందుకు తెలంగాణ పోలీసులు కంకణం కట్టుకున్నారు. డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిపై కూడా పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. చిన్న అనుమానం వచ్చినా సరే.. అదుపులోకి తీసుకుని శాంపిల్స్ కలెక్ట్ చేసి వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. డ్రగ్స్ దొరికితే మాత్రం.. అవి ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు తీసుకొచ్చారు.. ఎవరికి ఇచ్చారు.. ఎంత మంది ఇందులో ఉన్నారు.. లాంటి లోతైన దర్యాప్తు చేసి.. మూలాల దగ్గరి నుంచి నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే.. డ్రగ్స్ వాడటం గురించి ఏదైనా సమాచారం వస్తే.. స్పాట్లో దొరికిన వాళ్లు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది.. శాంపిల్స్ తీసుకుని, ల్యాబ్కు పంపించి, వాటి రిజల్ట్ వచ్చిన తర్వాత గానీ తేలట్లేదు. ఈ గ్యాప్లో కొందరు తమ అతితెలివి ప్రదర్శిస్తూ.. శాంపిల్స్ ఇచ్చేందుకు టైం తీసుకుంటున్నారు. తాము అందుబాటులో లేమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త అస్త్రాలతో సిద్ధమయ్యారు.
ఇకపై డ్రగ్స్ తీసుకున్న వారిని క్షణాల్లోనే గుర్తించేలా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా.. డ్రగ్స్ టెస్టులకు సంబంధించి కొత్త కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ కిట్స్తో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడా..? లేదా..? అనేది నిర్ధారించవచ్చని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కిట్స్ ద్వారా యూరిన్ శాంపిల్ కూడా లేకుండా సదరు వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడా..? లేదా..? అనేది తెలిసిపోతుందని పేర్కొన్నారు.
ఈ కిట్స్ సాంకేతికంగా రుజువయ్యాయని.. దీనికి సంబంధించి టెస్ట్ రిజల్ట్స్ను కూడా న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయని అధికారులు చెప్తున్నారు. పబ్బుల్లో, ప్రైవేట్ పార్టీల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే ఈ కిట్స్ ద్వారా వారిని క్షణాల్లోనే పట్టుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. దీంతో.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లాగానే.. డ్రగ్స్ టెస్ట్ కూడా అధికారులు నిర్వహించనున్నారన్న మాట. యువత మత్తుకు బానిసై.. జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని.. డ్రగ్స్కు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.