![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 05:01 PM
బీఆర్ఎస్ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోనప్పటికీ కోర్టులు చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించింది. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గత వారం వాదనలు ముగిశాయి. తాజాగా, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని రోహత్గీ అన్నారు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని తెలిపారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఒక కాలపరిమితి విధించాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని అన్నారు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా లేదా అనేది స్పీకర్ నిర్ణయమే అని తెలిపారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని కోర్టుకు తెలిపారు.జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ, సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞప్తి చేయడం లేదా ఆదేశించడం చేయలేమా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేసిన వారంలోనే బీఆర్ఎస్ నాయకులు పిటిషన్ దాఖలు చేశారని ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కనీసం ఆలోచించే సమయం కూడా ఇవ్వలేదని అన్నారు.జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ, కోర్టులు రాజ్యంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని, స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని ముకుల్ రోహత్గీ అన్నారు.