![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 01:54 PM
తెలంగాణలో బర్డ్ ఫ్లూ మళ్లీ భయపెడుతోంది. బుధవారం హైదరాబాద్ నగర శివార్లలోని ఓ ఫౌల్ట్రీ ఫారమ్ లో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్దారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.గత నాలుగు రోజుల క్రితం నగర శివారులోని ఓ ఫౌల్ట్రీలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. అధికారులు చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు.ల్యాబ్ నుంచి వచ్చిన టెస్టు ఫలితాల్లో బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ ఫామ్స్ ను అధికారులు సీజ్ చేశారు. అందులో పనిచేస్తున్న వారందరి శాంపిల్స్ సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ నేపథ్యంలో కోళ్లతోపాటు కోడి గుడ్లను కూడా ఎవరికీ అమ్మొద్దని ఫౌల్ట్రీ యాజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్ నగరంలోని అధిక శాతం చికెన్ దుకాణాలకు కోళ్లు, కోడి గుడ్లు నగర శివార్లలోని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ ల నుంచి సరఫరా అవుతుంటాయి. ప్రస్తుతం నగర శివార్లలోని ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతోపాటు.. పలు ఫామ్ లలోని కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగానే మరణించినట్లు నిర్ధారణ కావడంతో నగరంలోని చికెన్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ప్రస్తుతం బర్డ్ ఫ్లూగా నిర్దారణ అయిన అబ్దుల్లా పూర్ మెంట్ ఫౌల్ట్రీ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి, దోతిగూడెంలోని మూడు ఫౌల్ట్రీ ఫామ్స్ లో బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆయా ఫామ్స్ లో ఉన్న కోళ్లను అధికారులు జాగ్రత్తగా పూడ్చిపెట్టారు. ఆ ప్రాంతంలో ఐదు కిలో మీటర్లు వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు.ఇదిలాఉంటే.. బాగా ఉడికించిన చికెన్, కోడిగుడ్లు తినడం వల్ల వ్యాధి సోకే అవకాశాలు ఏమాత్రం లేవని వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. సాధారణంగా ఈ వైరస్ లు మనుషుల్లోకి ప్రవేశించవు. కానీ, కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర ఫౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ ఈ వ్యాధి వస్తే జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితోపాటు కడుపు నొప్పి, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బర్డ్ ఫ్లూ వైరస్ సోకకుండా ఉండాలంటే.. బాగా ఉండికించిన తరువాత మాత్రమే చికెన్, గుడ్లు వంటివి తినాలి. ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు. ఫౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు వ్యక్తిగత శుభ్రత కచ్చితంగా పాటించాలి. కోళ్ల ఫారమ్ లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, ఎన్ 95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.